క్రైమ్ మిర్రర్ : సిరియాలో దాదాపు 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహేర్ అసద్కు సిరియా న్యాయస్థానం గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఇదే కేసులో అసద్ బంధువు అతేఫ్ నజీబ్కు కూడా కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. తీర్పు సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విచారణకు హాజరైన నజీబ్ ఖైదీ దుస్తుల్లో కోర్టు బోనులో ఉండగా న్యాయమూర్తి తీర్పును ప్రకటించారు.
రష్యాలో ఆశ్రయం పొందిన అసద్ సోదరులు
తిరుగుబాటుదారులు డమాస్కస్లోకి ప్రవేశించిన సమయంలో బషర్ అల్ అసద్, మహేర్ అసద్ సిరియా నుంచి రష్యాకు వెళ్లిపోయారు. అనంతరం అతేఫ్ నజీబ్ను అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అసద్ ప్రభుత్వంలో కీలక స్థాయిలో పనిచేసిన అధికారుల్లో నజీబ్ ఒకరని సమాచారం. సిరియా సైన్యంలో ఆయన బ్రిగేడియర్ జనరల్గా సేవలందించారు. 2011లో బషర్ అల్ అసద్ పాలన కొనసాగుతున్న సమయంలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్లో రాజకీయ భద్రతా విభాగానికి నజీబ్ బాధ్యతలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, తిరుగుబాటును అణచివేసే చర్యల్లో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కోర్టు తీర్పు సిరియాలో గత పాలనకు సంబంధించిన నేరాలపై జరుగుతున్న న్యాయ ప్రక్రియలో ప్రాధాన్యం సంతరించుకుంది.
also read : తెలంగాణ లో నీళ్ల రాజకీయం…!
