-
18న గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం
-
కొత్త అజెండాతో ఆంధ్రప్రదేశ్
-
తప్పు పడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు
-
గత పదేళ్లు ఏపీ వైఖరి అదేనంటున్న కాంగ్రెస్ సర్కార్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బిఆర్ఎస్ మళ్లీ నీళ్ల రాజకీయం మొదలుపెట్టింది. ఆగస్టు 18న గోదావరి నది యాజమాన్య బోర్డ్ సమావేశం జరుగుతుండడంతో.. దానిని ఆసరాగా తీసుకొని రాజకీయ రగడ మొదలుపెట్టింది భారత రాష్ట్ర సమితి. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు లేఖ రాయడం కలకలం రేపింది.
ఏపీఈఆర్ యాక్ట్ 2014 లోని సెక్షన్ 85 కింద జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సి డబ్ల్యూ సి, జల శక్తి మంత్రిత్వ శాఖలు ఇదివరకే అన్ని రకాల సాంకేతిక, జలవనరుల విశ్లేషణల తరువాత సీతారామ, కాలేశ్వరం, సమ్మక్క సాగర్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను మళ్లీ సమీక్షించేలా ఏపీ ప్రభుత్వం అజెండాలో అంశాలను చేర్చిందని.. ఇది తెలంగాణ నీటి హక్కులను హరించడమేనని హరీష్ రావు ఆరోపిస్తున్నారు.
-
ఉత్తమ్ కుమార్ కౌంటర్..
హరీష్ రావు ఆరోపణలను తెలంగాణ సర్కార్ తిప్పికొడుతోంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించడంలో పూర్తిగా కట్టుబడి ఉందని.. భారత రాష్ట్ర సమితి నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
బోర్డు సమావేశాల్లో పొరుగు రాష్ట్రమైన ఏపీకి ఇలాంటి అభ్యంతరాలను లేవనెత్తడం కొత్త కాదని.. రాష్ట్ర విభజన జరిగినా తర్వాత ప్రతి సమావేశాల్లోనూ ఇటువంటి అభ్యంతరాలు ఏపీ నుంచి వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలోను ఇదే జరిగిందని చెప్పుకొచ్చారు.
అప్పట్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. అప్పట్లో లేని అన్యాయం.. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్నట్టుగా బిఆర్ఎస్ చిత్రీకరిస్తాందని.. ఇది కేవలం రాజకీయ డ్రామాగా తేల్చి చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
-
వాటిని గుర్తు చేస్తున్న కాంగ్రెస్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభ్యంతరాలను తిప్పికొడుకు సీతారామ ఎత్తిపోతల పథకానికి.. జాతీయస్థాయిలో సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుంచి క్లియరెన్స్ సాధించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం కాలేశ్వరం, చిన్న కాలేశ్వరం, సమ్మక్క సాగర్, చనక కోరట, మోడీ గుంట వాగు వంటి ఏడు ప్రధాన ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలిపినప్పటికీ.. తెలంగాణ తరుపున గట్టి చట్టపరమైన సాంకేతిక వాదనలు వినిపించి.. తమ ప్రాజెక్టులను కాపాడుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.
మరోవైపు భారత రాష్ట్ర సమితి హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల, పోలవరం బనకచర్ల వంటి ప్రాజెక్టుల పనులు వేగంగా ముందుకు సాగిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. మొత్తానికైతే తెలంగాణలో మళ్లీ నీళ్ల రాజకీయం మొదలైనట్టు.
