శ్రీకాకుళం జిల్లాలో మహిళా పోలీసు అధికారితో అనుచితంగా ప్రవర్తించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఆయనను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
గత నెల 30న శ్రీకాకుళంలో బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై అనుచిత ప్రవర్తన జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు అయింది. అప్పటి నుంచి రవికుమార్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
చివరకు శనివారం రాత్రి చిలకపాలెం కూడలి వద్ద పోలీసులు అతడిని పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఉన్న కారులో మాస్క్ ధరించి ప్రయాణిస్తున్న సమయంలో అతడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న సమయంలో ఆయన తరచూ ఫోన్లు, సిమ్ కార్డులు మార్చుతూ రాష్ట్రం వెలుపల కూడా సంచరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక తన వాదనలో భాగంగా, తాను స్వయంగా లొంగిపోవడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని రవికుమార్ పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కాగా, కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. రవికుమార్ పరారీకి సహకరించిన వారిపైనా దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.
also read: వైద్య విద్యార్థిని ప్రియాంక కేసు- ‘హత్యాయత్నం’గా నమోదు చేయాలంటూ తండ్రి ఫిర్యాదు
