క్రైం మిర్రర్ : సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను కోర్టు పరిశీలించాలని కోరగా, ధర్మాసనం అందుకు అంగీకరించలేదు.
వీడియోలు చూసేందుకు తమ వద్ద సమయం లేదని, కోర్టు సమయాన్ని అనవసరంగా వృథా చేయవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించినట్లు విచారణ సందర్భంగా వెల్లడైంది. అలాగే, పిటిషనర్ కూడా తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను అంతకుముందే ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొనడంతో, పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై సీజేపీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ నిరసన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నిరసనకారులు, పోలీసులు గాయపడగా, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
also read : లెనిన్ తో బ్లాక్బస్టర్.. ఇప్పుడు ధనుష్తో నెక్ట్స్ మూవీ…!