రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరుగురు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్కుమార్ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
నిందితుడి అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించిన వారికి ఈ బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు.
also read: చట్టం చెప్పే ఖాకీ.. తానే ఉల్లంఘిస్తే? మైనర్తో డ్రైవింగ్ ఘటన వైరల్
కాగా, దైవాలగూడ ప్రాంతానికి చెందిన రాజ్కుమార్పై మైనర్ బాలికను వేధించిన ఆరోపణలపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో అతను ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైన కొద్ది గంటల్లోనే షాబాద్లోని బాధితురాలి ఇంటికి చేరుకుని ఘోరానికి పాల్పడ్డాడు.
బాలికను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుపడిన తల్లి, నాయనమ్మపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం బాలికను సమీప ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చాడు. అక్కడితో ఆగకుండా తన స్వంత ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిందితుడి కదలికలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు కోరుతున్నారు.
also read: తాడుతో… థార్కు కట్టి- ఏటీఎం లాగేసి… డబ్బు దోచేసి…