హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి, తనను భారత సైన్యంలో (ఆర్మీ) అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ముకేరా గోవర్ధన్ (29)గా గుర్తించారు. అతను షామీర్పేటకు చెందినవాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, గోవర్ధన్ సోషల్ మీడియా ద్వారా బాధిత మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనను ఆర్మీ అధికారిగా నమ్మించేందుకు ఏఐ (AI) సాయంతో రూపొందించిన సైనిక యూనిఫాం ఫోటోలను పంపించాడు. దీంతో అతనిపై నమ్మకం పెంచుకున్న మహిళతో సన్నిహితంగా మెలిగి, త్వరలో వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు.
Also Read:ఢిల్లీలో సరికొత్త ఏపీ భవన్..! రూ.105 కోట్లతో నిర్మాణం…
కొంతకాలం తర్వాత తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, చికిత్స కోసం డబ్బు అవసరమని చెప్పి మహిళ నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. అనంతరం పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా గోవర్ధన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మహిళ ఒత్తిడి చేయడంతో ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు నాగోల్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో గోవర్ధన్ ఇప్పటికే వివాహితుడని, గతంలో కూడా ఆల్వాల్ ప్రాంతానికి చెందిన మరో మహిళను ఇదే తరహాలో వివాహం పేరుతో మోసం చేసిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ అదే తరహా మోసానికి పాల్పడినట్లు తేలింది.
Also Read:మూగబోయిన 5 దశాబ్దాల ఉద్యమ గళం.. ఖమ్మంలో కన్నుమూసిన ‘అరుణోదయ’ నాగన్న!!
నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మోసంలో మరెవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హెచ్చరిక: సోషల్ మీడియా లేదా మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమైన వ్యక్తుల ఉద్యోగ వివరాలు, గుర్తింపు పత్రాలు, కుటుంబ నేపథ్యాన్ని ధృవీకరించకుండా డబ్బు లావాదేవీలు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.