తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టిన వాట్సాప్ స్టేటస్ను చూసి అతడు చనిపోయాడని భావించిన భార్య తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిరుత్తురైపూండి సమీపంలోని కరుంబియూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ (31) నాగపట్టినంలోని పెట్రోల్ బంక్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య గాయత్రి (24), నాలుగున్నరేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. తాజాగా దంపతుల మధ్య కుటుంబ విషయాలపై గొడవ జరిగింది. దీంతో ప్రవీణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత మేట్టుపాలయం ప్రాంతానికి చేరుకున్న ప్రవీణ్ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, విషం తాగే ముందు తన కోసం తయారు చేసిన శ్రద్ధాంజలి పోస్టర్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టాడు. ఈ స్టేటస్ను చూసిన గాయత్రి, తన భర్త మరణించాడని భావించింది. తీవ్ర షాక్కు గురైన ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇదిలా ఉండగా, విషం తాగిన ప్రవీణ్ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన తిరుత్తురైపూండి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఒక అపార్థం కారణంగా జరిగిన ఈ విషాదం రెండు చిన్నారులను తల్లిలేని వారిగా మార్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, భావోద్వేగ నిర్ణయాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.