క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : SIR విషయంలో సీరియస్గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు. ఈరోజు(బుధవారం) కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. SIR అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. SIRతో బీజేపీ కుట్ర చేస్తోందని.. అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తనకి ఒక నియోజకవర్గం కేటాయిస్తే వెళ్లి పనిచేస్తానని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు తీరు మారితే ఒకే అని.. వారం రోజుల్లో తీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో యాక్టివ్గా ఉన్న మరోవ్యక్తిని ఇన్ఛార్జిగా నియమిస్తామని సీఎం స్పష్టం చేశారు.
పార్టీ కోసం పనిచేయని వాళ్లు పార్టీకి అవసరం లేదని తేల్చిచెప్పారు. SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నా SIR విషయంలో గ్రౌండ్ లెవల్కు వెళ్లి పనిచేయాల్సిందే అని అన్నారు. ‘ఎవరెవరు పని చేయడం లేదో నా దగ్గర రిపోర్ట్ ఉంది. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే మీటింగ్లో పేర్లు చెప్పాల్సి వస్తుంది. పేర్లు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని అన్నారు. ఇన్ఛార్జి మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని.. పనిచేయకపోతే ఇన్ఛార్జి మంత్రులను కూడా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జూమ్ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. SIR ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. SIR విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా తీరు మారాలని సూచించారు.
ప్రతి ఓటునూ కాపాడుకోవాలని ఆదేశించారు. లౌకికవాదుల ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందన్నారు. గద్వాల, మల్కాజిగిరి, భువనగిరి, నిజామాబాద్లో వీక్గా ఉన్నామని చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం సబబు కాదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఓటు హక్కు రాజకీయాల కోసం మాత్రమే కాదని మీనాక్షి నటరాజన్ అన్నారు. జూమ్ మీటింగ్లో మాట్లాడుతూ.. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఓటు హక్కు అంతే అవసరమన్నారు. ఓటు అనేది ప్రతి మనిషికి సోషల్ స్టేటస్ అని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓటు హక్కు వచ్చిందని తెలిపారు. ఓటు హక్కును కాపాడవలసిన బాధ్యత అందరిది అని మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. జూమ్ మీటింగ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.