క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు బిగ్ రిలీఫ్. కొద్ది రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జనసేనాని పవన్ ఒక భూమి ఆక్రమించారంటూ ప్రచారం సాగుతోంది. దీని పైన పవన్ సైతం స్పందించారు. ఈ తరహా ప్రచారం పైన తాజాగా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కల్యాణ్ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా, నిరాధారమైన ఆరోపణలతో సాగుతున్న కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనాని పవన్ కల్యాణ్కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట లభించింది. పవన్ కళ్యాణ్పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ చేసిన పోస్టులపై కోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా గ్రూప్లను కోర్టు ఆదేశించింది. ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, మెటా సంస్థలకు అత్యవసర నోటీసులు బెంగళూరు కోర్టు జారీ చేసింది.
అనామక అకౌంట్లపై కోర్టు ‘జాన్ డో’ (John Doe) ఆర్డర్ జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్న నిర్దిష్ట యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని ఆయా సంస్థలకు జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు స్పష్టం చేసింది. జూలై 24వ తేదీకి ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. హైదరాబాద్ లోని ‘కోడి చెరువు’ భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహరంపై బెంగళూరు కోర్టు విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల తెలంగాణలో జనసేన పార్టీ తరపున ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించిన తర్వాత నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ కోడి చెరువు భూముల వివాదంపై స్పందించారు. తాను ఎక్కడా ఎలాంటి చెరువు భూములను ఆక్రమించలేదని, ఒకవేళ ఆరోపణలు చేస్తున్న వారు ఆక్రమణలను నిరూపిస్తే.. ఆ మొత్తం భూమిని తానే స్వయంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారానికి ప్రస్తుతానికి ముగింపు లభించినట్లుగా కనిపిస్తోంది.