New Drug Rules 2026: దగ్గు మందుల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్ చీటీ లేకుండా దగ్గు సిరప్ లు కొనడం చేయడం, అమ్మడం సాధ్యం కాదు. మందుల నాణ్యత, రోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనలను ప్రభుత్వం తాజాగా సవరించింది.
దగ్గుమందు వాడి చిన్నారులు చనిపోవడంతో…
ఇటీవల కొన్ని దేశాల్లో చిన్నారులు దగ్గు మందులు వాడిన తర్వాత మరణించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసిన కొన్ని సిరప్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వెయ్యి మందికంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో, డాక్టర్ చీటీ లేకుండానే దగ్గు సిరప్లు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అంతేకాదు, ఈ మందులను సాధారణ దుకాణాల్లో కూడా విక్రయించవచ్చు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం-1940లోని షెడ్యూల్ ‘కే’ కింద ఉన్న ప్రత్యేక నిబంధనల వల్ల ఈ వెసులుబాటు అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు ఆ నిబంధనలో మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం దగ్గు మందులను కేవలం ఫార్మసీ లైసెన్స్ కలిగిన మెడికల్ షాపులలో మాత్రమే విక్రయించాలి. అంతేకాకుండా, వాటిని కొనుగోలు చేయాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
స్వయంగా వాడటం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించాలని..
రోగులు స్వయంగా మందులు వాడటం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. సరైన వైద్య సలహా లేకుండా దగ్గు మందులను వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ ల విక్రయాల్లో మరింత నియంత్రణ ఉండనుంది.