సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ప్రక్రియ ఇప్పుడు వివాదంగా మారింది. బోర్డు అధికారికంగా ఇచ్చిన జవాబు పత్రాల స్కాన్ కాపీలు తమవి కావని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని పేపర్లలో చేతిరాత పూర్తిగా వేరే వ్యక్తిదిగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో సీబీఎస్ఈ వ్యాల్యుయేషన్ విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పేపర్లు మారిన విషయం వాస్తవమేనన్న సీబీఎస్ఈ
ఈ సమస్యకు కారణం ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్’ (ఓఎస్ఎం) విధానంలో జరిగిన సాంకేతిక లోపాలేనని భావిస్తున్నారు. పేపర్లు స్కాన్ చేసే సమయంలో విద్యార్థుల వివరాలు తారుమారయ్యి ఉండొచ్చని అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కొన్ని పేపర్లు మారిపోయిన విషయం నిజమేనని అంగీకరించింది. ప్రస్తుతం సమస్యను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
విద్యార్థి వేదాంత్ పోస్ట్ తో వెలుగులోకి..
ఈ వ్యవహారం బయటకు రావడానికి కారణం ఢిల్లీకి చెందిన విద్యార్థి వేదాంత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్. ఫిజిక్స్ లో తక్కువ మార్కులు రావడంతో అతడు రీ-వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేశాడు. బోర్డు పంపిన స్కాన్ కాపీ చూసిన తర్వాత అది తన జవాబు పత్రం కాదని ఎక్స్ లో పోస్టు చేశాడు. తన కుటుంబం కూడా ఈ సమస్యను బయటపెట్టేందుకు ప్రత్యేకంగా ఎక్స్ ఖాతా ప్రారంభించింది.
వేదాంత్ పై ట్రోలింగ్ చేసినా..
అయితే, వేదాంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అకౌంట్ లో లొకేషన్ ‘సౌత్ ఏషియా’గా కనిపించడంతో కొందరు నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. దూరదర్శన్ యాంకర్ ఆశోక్ శ్రీవాస్తవ్ కూడా వేదాంత్పై విమర్శలు చేశారు. కొందరు అతడిని పాకిస్థానీ అని కూడా ఆరోపించారు. అయితే తర్వాత ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో అశోక్ శ్రీవాస్తవ్ వేదాంత్ కుటుంబానికి క్షమాపణ చెప్పారు.
తర్వాత సీబీఎస్ఈ బోర్డు వేదాంత్కు ఈమెయిల్ ద్వారా అసలు జవాబు పత్రాన్ని పంపింది. ఇదే తరహాలో సంజన అనే మరో విద్యార్థిని కూడా తన కెమిస్ట్రీ పేపర్ విషయంలో ఫిర్యాదు చేసింది. ఇంకా పలువురు విద్యార్థులు తమ పేపర్లలో పేజీలు కనిపించకపోవడం, పేర్లు స్పష్టంగా లేకపోవడం వంటి సమస్యలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్ వ్యవస్థపై పెద్ద చర్చ జరుగుతోంది.