అమరావతి, క్రైమ్మిర్రర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయమైందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించారు. డేటా బేస్ మాయం కావడంతోపాటు డీఎస్సీ పరీక్ష లీకుల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లీకుల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు.
చంద్రబాబూ మీరు నిర్వహించింది డీఎస్సీనా.? లేక ఉద్యోగార్థులను మోసం చేసే దగా డీఎస్సీనా.? అంటూ ప్రశ్నించారు జగన్. డీఎస్సీ నిర్వహణ ప్రక్రియలో పారదర్శకతో లోపించిందన్న మాజీ సీఎం.. పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం చేశారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్ధేశ పూర్వకంగా ఆలస్యం చేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారని, దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నారని జగన్ ఎద్దేవా చేశారు. తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా.? అంటూ జగన్ ప్రశ్నించారుర.మీ సుపుత్రుడి లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపోడుతున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు.
సీక్రెట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంకా…?
డీఎస్సీ నిర్వహణపై సంచలన ఆరోపణలు చేసిన జగన్.. మరో ఆసక్తికరమైన అభియోగాన్ని చేశారు. పరీక్షల నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న సీక్రెట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్మకున్నారన్న జగన్.. రూ.15 లక్షలకు బేరసారాలు చేసినవిషయాన్ని ప్రశ్నించారు. మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవమా.? కాదా.? అని జగన్ ప్రశ్నించారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి కూడా ఫేక్ సర్టిఫికెట్లను ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారని, ఈ రిక్రూట్మెంట్ను వేలం పాట తరహాలో నిర్వహించారంటూ ఆరోపించారు.
డీఎస్సీకి సంబంధించిన వివరాలను డేటా బేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించిన జగన్.. మెరిట్ లిస్టులను ఎందుకు దాచిపెట్టారన్నారు. ఎంపికైన వారికి మాత్రమే ఎందుకు నేరుగా మెసేజ్లు పంపించారని, కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదన్నారు. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకు కన్వీనర్ అయినప్పటికీ.. ఉన్నట్టుండి ఆయన్ను ఎందుకు తొలగించారని, విద్యాశాఖలోని జాయింట్ డైరక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టినట్టు అంటూ జగన్ ప్రశ్నించారు. తాజాగా జగన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండగా, తాజాగా జగన్ చేసిన విమర్శలతో మరోసారి ఈ వ్యవహారం చర్చలోకి వచ్చింది.