దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చమురు కంపెనీలు లీటరుకు సగటున రూ.3 వరకు ధరలు పెంచాయి. అయితే, ఇది ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చమురు సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలను తగ్గించేందుకు భవిష్యత్తులో మరో రూ.10 వరకు పెంపు అవసరం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ఎఫెక్ట్
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం ముగింపుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగకపోవడంతో ముడి చమురు ధరలు ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్నాయి. దీనివల్ల భారతదేశానికి దిగుమతి అయ్యే చమురు ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఇంధన ధరలు పెంచకపోతే చమురు కంపెనీలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్నితగ్గించినా..
మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 వరకు తగ్గించినప్పటికీ, చమురు కంపెనీలు ఇంకా ప్రతి లీటరుపై రూ.17 నుంచి రూ.18 వరకు నష్టపోతున్నాయని సమాచారం. దీంతో ధరల పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటుపై కూడా ప్రభావం పడొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
సామాన్య ప్రజలపై నేరుగా పెట్రో భారం
ఇంధన ధరల పెరుగుదల ప్రభావం సామాన్య ప్రజలపై నేరుగా పడే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ఖరీదు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వంటగ్యాస్, పాల ధరలు పెరుగుతుండటంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు మరింత భారమవుతున్నాయి. ఇంధనం, పాల ధరల పెరుగుదల కలిపి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 0.42 శాతం వరకు పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.