పంజాబ్ శాసనసభలో శుక్రవారం జరిగిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తమ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ ప్రక్రియకు ముందు సభలో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం మాన్ మద్యం సేవించి సభకు వచ్చారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సీఎంకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
ఈ ఆరోపణల నేపథ్యంలో సీఎం సహా అన్ని ఎమ్మెల్యేలపై బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. అయితే, స్పీకర్ ఆ డిమాండ్ను తిరస్కరించారు. దీంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు బీజేపీ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఈ పరిస్థితుల్లో సభలో ప్రతిపక్షం లేకుండానే సీఎం మాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం బలహీనపడుతుందన్న ప్రచారం జరిగింది. ఈ వాదనలకు చెక్ పెట్టేందుకే విశ్వాస తీర్మానం తీసుకొచ్చినట్లు సీఎం మాన్ తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
మొబైల్ ఫోన్ వాడకంపై సీఎం అభ్యంతరం
సభలో మరోసారి వాగ్వాదం చెలరేగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా మొబైల్ ఫోన్ వాడకంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేయగా, ఖైరా కూడా గత సమావేశాల్లో సీఎం కుటుంబ సభ్యుల ప్రవర్తనపై వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల యుద్ధం మరింత తీవ్రతరం అయింది. ప్రతిపక్ష నేతలు సీఎం ఆరోపణలను మద్దతు ఇస్తూ మాట్లాడారు. చివరకు పరిస్థితి అదుపు తప్పడంతో కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. మొత్తంగా ఈ సమావేశం రాజకీయ వేడిని మరింత పెంచింది.