-
విధులకు సిబ్బంది పంగనామాలు
-
ప్రశ్నిస్తే విజిట్ పేరుతో దాట వేత
-
పట్టించుకోని పై అధికారులు
-
ఇబ్బందుల్లో ప్రజలు
రంగారెడ్డి, క్రైమ్ మిర్రర్ : మాడ్గుల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమస్యలకు నిలయంగా మారింది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే సమస్యగా తయారయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా కార్యాలయంలోని జీపీఓ (GPO)లు, ఇతర సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫీల్డ్ పేరుతో ‘మాయ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సిబ్బంది ఎవరూ సీట్లలో కనిపించడం లేదు. ఎక్కడ అని ప్రశ్నిస్తే ఫీల్డ్ విజిట్ లో ఉన్నారనే సమాధానం వినిపిస్తోంది.
కానీ, నిజానికి వారు ఫీల్డ్లో ఉన్నారా లేదా వ్యక్తిగత పనుల్లో ఉన్నారా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఉదయం 11 గంటలైనా కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తుండటంతో, దూరాభారం నుంచి వచ్చే వృద్ధులు, రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ధరణి సమస్యలు, కుల ధృవీకరణ పత్రాలు, ఇతర రెవెన్యూ పనుల కోసం వచ్చే ప్రజల విన్నపాలను బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేపు రా మాపు రా అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం అలవాటుగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, బయోమెట్రిక్ హాజరును కఠినతరం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.