Homeఆంధ్ర ప్రదేశ్ఇక గ్రేటర్ విజయవాడ...!

ఇక గ్రేటర్ విజయవాడ…!

  • ప్రభుత్వం కీలక నిర్ణయం

  • చుట్టుపక్కల 80 గ్రామాల వరకు విలీనం

  • రాజధానితో అనుసంధానం చేయడమే అసలు ఉద్దేశం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మరో మహానగరం అవతరించింది. విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విజయవాడ ను గ్రేటర్ విజయవాడ గా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. నగరం చుట్టూ 70 నుంచి 80 గ్రామాలను విజయవాడలో విలీనం చేసి మహానగరం గా తీర్చిదిద్దనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తద్వారా విజయవాడ నగర పరిధి భారీ స్థాయిలో పెరగనుంది. ప్రధానంగా గన్నవరం తో పాటు పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలు గ్రేటర్ విజయవాడ పరిధిలోకి రానున్నాయి.

రెండో మహానగరం..
ఏపీలో ఇప్పటికే విశాఖ మహానగరం ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి విజయవాడ చేరనుంది. గ్రేటర్ విజయవాడ ను విస్తరించి అమరావతి రాజధానికి అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా మరో బ్యారేజీ నిర్మించనున్నారు. దీనికి కూడా టెండర్లు పిలిచారు. తద్వారా విజయవాడ నగరానికి అమరావతికి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. కానీ చేయలేకపోయింది. అయితే విజయవాడలో కలపాలని కొన్ని గ్రామాలు కోరుకుంటున్నాయి. వద్దని మరికొన్ని గ్రామాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి.

రాజధానితో అనుసంధానించాలని..
అమరావతి రాజధానితో విజయవాడ మహా నగరాన్ని అనుసంధానం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. తద్వారా రాజధాని పరిధిలోని విజయవాడ నగరం కూడా కొనసాగుతుందని భావిస్తోంది. ముందుగా మహానగరంగా అభివృద్ధి చేసి.. క్రమేపి రాజధానికి దగ్గర చేయాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు మహానగరం విస్తరణ జరిగే పని కాదు. అందుకే వచ్చే యాడాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మారనున్న ముఖచిత్రం..
గ్రేటర్ విజయవాడ ముఖచిత్రం మారనుంది. గన్నవరం, నూజివీడు, పెనమలూరు, మైలవరం వంటి కీలక నియోజకవర్గం విజయవాడలో విలీనం కానున్నాయి. తద్వారా విజయవాడ నగర పరిధి పెరగడమే కాకుండా అధిక ఆదాయం సైతం సమకూరుతుంది. ఆయా ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయి. నగరికరణ కనిపిస్తుంది. అంతకుమించి రాజధానికి అనుసంధాన నగరంగా విజయవాడ అవతరించనుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు