ఢిల్లీ, క్రైమ్మిర్రర్: బిహార్ సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరికే పట్టం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నితీస్ కుమార్ రాజ్యసభకు ఎన్నికై సీఎం పదవికి రాజీనమా చేయబోతున్నారు. ఆ తరువాత ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ నేత సీఎంగా ఎన్నికవుతారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం నితీష్ తరువాత బీజేపీ సీనియ్ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికే సీఎంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.
కాగా నితీష్ కుమార్ మంగళవారం, ఏప్రిల్ 14న ఉదయం 11 గంటలకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. పాట్నాలో జరిగే ఈ సమావేశం అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం ఎన్డీయే లెజిస్లేటర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్డీయే నూతన లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఆ నేత బిహార్ సీఎంగా ఎన్నికవుతారు. అయితే, సీఎం పదవికోసం అందరిలోకి ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్రాట్ చౌదరి.
ఆయన బీజేపీలో సీనియర్ నేత. ప్రస్తుత బిహార్ డీసీఎం. 2023లో బిహార్ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఓబీసీలోని కొయేరి సామాజికవర్గానికి చెందిన సామ్రాట్ చౌదరినే బీజేపీ అధిష్టానం సీఎంగా ఎంపిక చేసిందని తెలుస్తోంది. ఇంతకాలం ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎంగా కొనసాగారు. ఆయన రాజ్యసభకు వెళ్తుండటంతో ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ తరఫున సీఎం పదవి చేపడుతారు.
