దేశంలో ఆర్థిక సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలు, బీమా, పెట్టుబడులు వంటి సేవల కోసం తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఆధార్, పాన్ వంటి పత్రాలను సమర్పించడం తప్పనిసరి. అయితే ఇప్పుడు ఈ విధానంలో పెద్ద మార్పు తీసుకువస్తూ సీకేవైసీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా పాన్, ఆధార్ లాంటి పత్రాలను మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేవైసీ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది.
కేవైసీ అంటే “నో యువర్ కస్టమర్” అనే ప్రక్రియ. దీనివల్ల ఒక వ్యక్తి నిజమైనదా కాదా అన్నది ఆర్థిక సంస్థలు ధృవీకరిస్తాయి. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, గ్యాస్ వంటి అనేక సేవల్లో పారదర్శకత కోసం ఇది తప్పనిసరి చేశారు. ఇప్పటివరకు కేవైసీ కోసం గుర్తింపు పత్రాలు సమర్పించి, పేరు, జనన తేదీ, చిరునామా వంటి వివరాలను ధృవీకరించాల్సి వచ్చేది. బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్, బీమా వంటి సేవలందరికీ ఇది కీలక ప్రక్రియగా ఉండేది.
ఇప్పుడు ప్రవేశపెట్టిన సీకేవైసీ విధానం ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. ఇందులో ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక యూనిక్ నెంబర్ కేటాయిస్తారు. ఈ నెంబర్ను కిన్ నెంబర్ లేదా సీకేవైసీ ఐడెంటిఫైయర్ అని పిలుస్తారు. మొత్తం 14 అంకెలతో ఉండే ఈ నెంబర్ మీ కేవైసీకి శాశ్వత గుర్తింపుగా పనిచేస్తుంది. ఒకసారి ఈ నెంబర్ పొందిన తర్వాత, ఎక్కడైనా ఆర్థిక సేవలు పొందాలంటే ఈ ఒక్క నెంబర్ చెప్పడం సరిపోతుంది. మళ్లీ మళ్లీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఈ సీకేవైసీ వ్యవస్థను సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేవైసీ వివరాలు డిజిటల్గా భద్రపరచబడతాయి. దీంతో ఒకసారి నమోదు చేసిన వివరాలు అన్ని ఆర్థిక సంస్థలకు అందుబాటులో ఉంటాయి. ఇది సమయం, శ్రమను ఆదా చేయడంతో పాటు, సేవల వేగాన్ని కూడా పెంచుతుంది.
ఇంకా సీకేవైసీ నెంబర్ తెలుసుకోవడం కూడా సులభమే. 77990 22129 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే మీ సీకేవైసీ నెంబర్ సందేశ రూపంలో వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా సీకేవైసీ నమోదు కాలేకపోతే, దానిని ఎలా నమోదు చేసుకోవాలో సంబంధించిన వివరాలు కూడా అందుతాయి. ఆ సూచనలను అనుసరించి మీరు సులభంగా సీకేవైసీ నమోదు చేసుకోవచ్చు.
ALSO READ: మండిపోతున్న ఎండలు.. ఏపీలో 11 గంటలవరకే హాఫ్ డే స్కూల్స్
