Homeక్రైమ్తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్...!

తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్…!

  • ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న డీజీపీ శివధర్ రెడ్డి

  • ముగ్గురు పేర్లతో ప్రభుత్వం సిఫారసు

  • ఆనంద్ వైపే సీఎం రేవంత్ మొగ్గు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు కొత్త డిజిపి రానున్నారు. ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. 1991 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ రాష్ట్ర పోలీస్ బాస్ గా రానున్నారు. దాదాపు ఆయన నియామకం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సివి ఆనంద్. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పరిపాలనలో ఉన్న అపార అనుభవం ఆయనకు కలిసి వచ్చింది. యూపీఎస్సీ ప్రతిపాదించిన ముగ్గురు పేర్లు సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రలు కాగా.. సీఎం రేవంత్ మాత్రం సివి ఆనంద్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దాదాపు ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

కలిసి వచ్చిన సీనియారిటీ..
తెలంగాణ ప్రస్తుత డిజిపిగా శివధర్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ ఏప్రిల్ తో ముగుస్తుంది. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి. సివి ఆనంద్ ఆయన కంటే సీనియర్. దాదాపు ఓ మూడేళ్ల పాటు సీనియారిటీ కలిగిన అధికారి. కానీ గతంలో అనివార్య కారణాలవల్ల శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు నిబంధనల ప్రకారం యూపీఎస్సీ ప్యానెల్ ద్వారా పూర్తిస్థాయి డీజీపీ నియమించాల్సి వచ్చింది. సీనియారిటీ ప్రాతిపదికన సివి ఆనంద్ కు లైన్ క్లియర్ అయింది.

ముఖ్యమంత్రి మొగ్గు అందుకే
తెలంగాణ పోలీస్ శాఖలో.. క్యాడర్ పరంగా సివి ఆనంద్ కంటే సీనియర్లు ఎవరూ లేరు. 1989, 1990 బ్యాచ్ లకు చెందిన అధికారులు ఎప్పటికీ పదవీ విరమణ చేశారు. కొందరు కేంద్ర సర్వీస్ లో స్థిరపడ్డారు. అయితే సివి ఆనంద్ మాత్రం రాష్ట్రంలో సీనియర్ అధికారిగా నిలిచారు. ప్యానల్ లోని మిగిలిన ఇద్దరు అధికారులు వినాయక ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా.. ఇద్దరూ 1994 బ్యాచ్ కు చెందిన వారే. వారిద్దరి కంటే దాదాపు మూడేళ్ల పాటు సీనియర్ సివి ఆనంద్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపినట్లు అర్థం అవుతోంది.

రెండేళ్లకు పైగా ఆ పదవిలో..
2028 మే వరకు సివి ఆనంద్ ఆ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్ల వరకు అదే పదవిలో ఆయన ఉంటారు. ఆ తరువాత స్థానంలో వినాయక్ ఆప్టే ఉన్నారు. కానీ సుదీర్ఘకాలం ఆయన కేంద్ర సర్వీస్ లో కొనసాగుతూ వచ్చారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆనంద్ కు ఉన్న పట్టు ఆయనకు లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సి వి ఆనంద్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో 20 రోజులు మాత్రమే ప్రస్తుత డిజిపి పదవీకాలం ఉండడంతో.. సివి ఆనంద్ నియామకం పై అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు