మహబూబాబాద్, క్రైమ్ మిర్రర్: ప్రేమ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా నమ్మించి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ యువతి మౌన పోరాటానికి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండె శివారు వాగ్య తండాలో చోటు చేసుకుంది. వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం, కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన గూగులోత్ స్పందన గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయమై రఘురాం పెళ్లికి నిరాకరిస్తున్నాడు. ఈ విషయంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించినప్పటికీ సమస్యకు పరిష్కారం కాలేదని యువతి తెలిపింది.
దీనితో దిక్కుతోచని స్థితిలో ఆ యువతి న్యాయం చేయాలంటూ నేరుగా ప్రియుడి ఇంటి వద్దనే మౌన పోరాటానికి దిగింది. ఎండను సైతం లెక్కచేయకుండా యువతి ఇంటి బయట కూర్చుని నిరసన తెలుపుతుంది. తనకు న్యాయం జరిగే వరకు, అతను తనను పెళ్లి చేసుకునే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు” అని ఆమె భీష్మించుకుని కూర్చుంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలు మాత్రం తనకు పెళ్లి ఒక్కటే మార్గమని, లేదంటే తన ప్రాణాలు తీసుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
