* రాష్ట్రంలో పదుల సంఖ్యలో కార్పొరేషన్లు
* 300కు పైగా డైరెక్టర్ పోస్టులు ఖాళీ
* ఆశగా ఎదురు చూస్తున్న ఆశావహులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం నేతల్లో అసహనం పెంచుతోంది. వెంటనే పోస్టులు భర్తీ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన పోస్టులను భర్తీ చేశారు. కానీ ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అందులో కీలకమైన రాష్ట్ర స్థాయి పదవులు కూడా ఉన్నాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. దీంతో నేతల్లో అసహనం పెరుగుతోంది. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మాత్రమే నామినేటెడ్ పోస్టులు ప్రకటన ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది.. అయితే అంతకంటే ముందే భర్తీ చేస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి.
అధికారంలో వచ్చిన వెంటనే..
2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వెనువెంటనే కార్పొరేషన్ల చైర్మన్ లతోపాటు కొన్నింటి డైరెక్టర్లను నియమించారు. అయితే అటు తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తోంది. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదు. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కూడా పెరుగుతుంది. ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన వారికి గుర్తింపుగా పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. మొన్న ఆ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మధ్య చర్చలు జరిగాయి కానీ కొలిక్కి రాలేదు. అయితే మొన్న ఆ మధ్యన ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వీటిపైనే సమీక్షించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు అని సంకేతాలు ఇచ్చారు. కానీ ఇది జరిగి రెండు నెలలు సమీపిస్తున్న ఇంతవరకు కదలిక లేదు.
ఎదురుచూపులు..
తెలంగాణ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కార్పొరేషన్ లతో పాటు 300 వరకు డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ల తో పాటు కార్యవర్గాలను భర్తీ చేశారు. అయితే వాటికి సంబంధించిన రెండేళ్ల గడువు ముగిసింది. ప్రధానంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఖాళీగా ఉంది. దానికోసం విపరీతమైన పోటీ ఉంది. కానీ భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
