పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలక కేంద్రంగా గుర్తింపు పొందిన ఖార్గ్ ఐలాండ్ పై అమెరికా దృష్టి కేంద్రీకరించడం పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఇరాన్ ఎగుమతి చేసే ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ద్వీపం నుంచే విదేశాలకు వెళ్లడం దీనికి ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చాలనే వ్యూహం అమెరికా వెనుక ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు నిల్వలు, ఎగుమతులపై నియంత్రణ సాధిస్తే ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచి, రాజకీయంగా లొంగదీసుకునే ప్రయత్నం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖార్గ్ ద్వీపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమో, లేక కొంతకాలం నియంత్రణలో ఉంచుకోవడమో వంటి పలు మార్గాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సైనిక కదలికలు వేగవంతమయ్యాయి. యూఎస్ఎస్ ట్రిపోలి సహా పలు యుద్ధ నౌకలు, వేల సంఖ్యలో మెరైన్ దళాలు పశ్చిమాసియాలో మోహరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అదనపు బలగాలు, యుద్ధ విమానాలు కూడా ఆ ప్రాంతానికి తరలించబడుతున్నాయి. ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని దేశాలు కూడా ఇరాన్పై ఒత్తిడి కొనసాగించాలని అమెరికాను ప్రైవేటుగా కోరుతున్నట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఇరాన్ కూడా తన రక్షణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి నియంత్రణ ద్వారా ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఖార్గ్ ద్వీపంపై అమెరికా చర్యలు కొనసాగితే, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, అలాగే ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాల్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఈ పరిస్థితులు మరింత తీవ్రమైతే, యుద్ధం ఒకే దేశానికి పరిమితం కాకుండా మొత్తం ప్రాంతాన్ని కవర్ చేసే బహుముఖ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వంటి శక్తులు రంగంలోకి దిగితే పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉంది. సముద్రంలో ఇప్పటికే మైన్లు ఏర్పాటు చేయడం, క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడం వంటి చర్యలు దీనికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
ఈ సంక్షోభం ప్రభావం కేవలం యుద్ధ పరిమితుల్లోనే ఆగిపోదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ చమురు ధరలు బ్యారెల్కు 150 నుంచి 200 డాలర్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, మాంద్య పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది. ఇరాన్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉండటంతో, ఈ ప్రాంతంలో ఏ చిన్న ఉద్రిక్తత కూడా గ్లోబల్ మార్కెట్లను కుదిపే శక్తి కలిగి ఉంది.
ALSO READ: ఏపీఎస్పీడీసీఎల్లో భారీ అవకతవకలు.. నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు సాధించిన 69 మంది అవుట్!
