బరువు తగ్గడం, టైప్ 2 మధుమేహం చికిత్స కోసం విస్తృతంగా వినియోగంలో ఉన్న సెమాగ్లుటైడ్ మందుల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మందుల వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వైద్యుల సూచన లేకుండా స్వయంగా వాడటం ప్రమాదకరమని డీసీఏ డీజీ షానవాజ్ ఖాసిం స్పష్టం చేశారు. మార్చి 2026 నాటికి ఈ ఔషధానికి సంబంధించిన పేటెంట్ గడువు ముగియడంతో, మార్కెట్లోకి వివిధ ఔషధ సంస్థల నుండి కొత్త ఫార్ములేషన్లు ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీ డోస్ వయల్స్, ప్రీ ఫిల్డ్ పెన్స్ రూపంలో అందుబాటులోకి వస్తున్న ఈ మందుల వాడకంపై ప్రజలు పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని అధికారులు సూచిస్తున్నారు.
సెమాగ్లుటైడ్ వంటి శక్తివంతమైన ఔషధాలను కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే వాడాలని డీసీఏ స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా ఎండోక్రినాలజీ, అంతర్గత వైద్యం నిపుణులు లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుండె సంబంధిత నిపుణుల ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే ఈ మందులను వినియోగించాలి. బరువు తగ్గాలనే ఉద్దేశంతో డాక్టర్ సలహా లేకుండా ఈ మందులను స్వయంగా తీసుకోవడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అజాగ్రత్తగా వాడితే ప్యాంక్రియాటైటిస్, మూత్రపిండ సమస్యలు, పిత్తాశయ వ్యాధులు, అలాగే తీవ్రమైన జీర్ణ సంబంధిత ఇబ్బందులు కలిగే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మందులను కొనుగోలు చేసే విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డీసీఏ సూచించింది. కేవలం లైసెన్స్ కలిగిన మెడికల్ దుకాణాల్లోనే ఈ ఔషధాలను కొనుగోలు చేయాలని, ఆన్లైన్ వేదికలు లేదా అనధికార విక్రేతల వద్ద కొనడం వల్ల నకిలీ లేదా నాసిరకం మందులు దొరికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ ఔషధాల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఔషధ సంస్థలు ఈ మందులపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయకూడదని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అనుమతించని విధంగా ఇతర ప్రయోజనాల కోసం వాడమని ప్రోత్సహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వైద్యులు తగిన మోతాదును నిర్ణయిస్తారని, అందువల్ల ప్రజలు స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని డీసీఏ కోరింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ మందులను విక్రయించినా, లేదా తప్పుదారి పట్టించే ప్రచారం చేసినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరింది.
ALSO READ: బంకుల వద్ద భారీ క్యూ లు.. ట్రోల్ చేసిన ఎలక్ట్రిక్ బైకర్ (VIDEO)
