క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు (EV) కొనుగోలు చేసేటప్పుడు 20% రాయితీ (రిబేట్) కల్పించాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ మరియు ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల ధరలో 20% వరకు ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఈ రాయితీని అందించడానికి ప్రభుత్వం ఆటోమొబైల్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలను (Guidelines) ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే ఈవీ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం 100% రోడ్డు టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమలు చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో కూడా 20% నుండి 30% వరకు ఈవీలను వాడాలని, ఐటీ మరియు ఫార్మా వంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా వీటి వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
