రామకృష్ణాపూర్, క్రైమ్ మిర్రర్: దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఉరికొమ్మలను ముద్దాడిన అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఆశయ సాధనకు యువత పోరాడాలనిసీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రాముడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సోమవారం భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకొని క్యాతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐ, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్కే-4 గడ్డ నుండి రాజీవ్ చౌక్ వరకు ‘కాడల ప్రదర్శన’ నిర్వహించారు.
ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ..బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పార్లమెంటుపై బాంబు దాడి చేసి, తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన వీరులు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ లని ఆయన కొనియాడారు. “1931 మార్చి 23న ఉరితీసే సమయంలో చివరి కోరిక ఏమిటని అడిగితే.. సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రులను, భార్యాపిల్లలను చూడాలని కోరుకుంటారు.కానీ, ఈ యువ కిశోరాలు మాత్రం ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ దేశ విముక్తిని కోరుకున్నారు” అని ఆయన వారి త్యాగాన్ని స్మరించుకున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినప్పటికీ, దేశంలో పేదలు, బడుగు బలహీన వర్గాల పరిస్థితి అట్టడుగు స్థాయిలోనే ఉందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.నేడు దేశంలో కార్పొరేట్ శక్తులు, బడా వ్యాపారులు మాత్రమే ఎదుగుతున్నారని, సామాన్యులకు విద్య,వైద్యం, ఉపాధి అవకాశాలు అందడం లేదని ధ్వజమెత్తారు.
ప్రస్తుత పాలకులు భారత రాజ్యాంగాన్ని దొంగదెబ్బ తీస్తున్నారని,రాజ్యాంగ ఫలాలను పేదలకు అందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.భగత్ సింగ్ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం,హక్కుల సాధన కోసం యువత మరో పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు,వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
