LPG Cylinder Quantity Reduction: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, సిలిండర్లలో ఎల్పీజీ మోతాదును తగ్గించే ప్రతిపాదనపై ఊహాగానాలు చెలరేగాయి. ప్రస్తుతానికి 14.2 కిలోల సిలిండర్లలో 10 కిలోల గ్యాస్ మాత్రమే నింపి తక్కువ ధరకు అందించాలనే ఆలోచన ప్రభుత్వరంగ చమురు సంస్థలు పరిశీలిస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశం ఉన్నట్లు ఆ వార్తలు వెల్లడించాయి.
క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఈ సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. ముఖ్యంగా గృహ వినియోగదారులు సిలిండర్ మోతాదు తగ్గిస్తే తమ అవసరాలు ఎలా తీర్చుకోవాలనే సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. 14.2 కిలోల సిలిండర్లలో గ్యాస్ మోతాదును తగ్గించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో రోజువారీ ఎల్పీజీ వినియోగం సుమారు 93,500 టన్నులుగా ఉంది. ఇందులో గృహ వినియోగమే 80,400 టన్నులుగా ఉంది. అయితే, ఈ నెల తొలి రెండు వారాల్లో ఎల్పీజీ వినియోగం సుమారు 17 శాతం తగ్గినట్లు సమాచారం. యుద్ధ పరిస్థితులు, సరఫరా అనిశ్చితి వంటి అంశాల ప్రభావంతో వినియోగం తగ్గినట్టు నిపుణులు భావిస్తున్నారు.
ఎల్పీజీ విషయంలో కేంద్రం కీలక చర్యలు
ప్రభుత్వం మాత్రం దేశంలో ఎల్పీజీ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. ఈ సందర్భంలో ప్రజలు వదంతులను నమ్మకూడదని సూచించింది. ఇక సిలిండర్ల మోతాదు తగ్గింపుపై వచ్చిన వార్తలు నిరాధారమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వినియోగదారుల్లో కొంత ఊరట నెలకొంది.
