రైల్వే టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు కీలక హెచ్చరిక జారీ అయింది. ఆన్లైన్ సేవలను విస్తృతంగా ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో అకస్మాత్తుగా సేవలు నిలిచిపోవడం అనేది ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే అంశంగా మారనుంది. ఇండియన్ రైల్వేస్ ప్రకటించిన వివరాల ప్రకారం మార్చి 26, 27 తేదీల్లో రైల్వే ఆన్లైన్ రిజర్వేషన్ సేవలకు తాత్కాలిక అంతరాయం కలగనుంది. టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా క్యాన్సిలేషన్, ఎంక్వైరీ, పీఎన్ఆర్ స్థితి చెకింగ్ వంటి కీలక సేవలు కూడా ఈ సమయంలో అందుబాటులో ఉండవు. దీంతో ముందుగానే అవసరమైన పనులను పూర్తి చేసుకోవాలని ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు.
నిర్వహణ పనుల కారణంగా ఢిల్లీ డివిజన్ పరిధిలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. మార్చి 26 రాత్రి 11.45 గంటల నుంచి మార్చి 27 ఉదయం 4.45 గంటల వరకు సుమారు 5 గంటల పాటు అన్ని ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ సమయంలో టికెట్ల బుకింగ్, రద్దు, పీఎన్ఆర్ వివరాలు తెలుసుకోవడం, ఎంక్వైరీ వంటి సేవలు అందుబాటులో ఉండవు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో కూడా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
ఈ వ్యవధిలో ఛార్టింగ్, ఈడీఆర్ సేవలు కూడా పనిచేయవని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు ఇది ఇబ్బందికర పరిస్థితిని తీసుకురానుంది. అందువల్ల అత్యవసరంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిన వారు మార్చి 26 రాత్రి 11.45 గంటల లోపే తమ పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. లేకపోతే సేవలు పునరుద్ధరించబడే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ దాదాపు 40 సంవత్సరాల పాతది కావడంతో, దాన్ని మరింత వేగవంతంగా, ఆధునికంగా మార్చేందుకు ఈ నిర్వహణ పనులు చేపడుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న హైస్పీడ్ రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా మారనుంది. అలాగే ఇతర సేవలను కూడా త్వరగా పొందే అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ తాత్కాలిక అసౌకర్యాన్ని ప్రయాణికులు సహకరించి అర్థం చేసుకోవాలని రైల్వేశాఖ కోరింది.
ALSO READ: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు
