పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కీలక చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ వాణిజ్య నౌకల భద్రత కోసం భారత నౌకాదళం పర్షియన్ గల్ఫ్ సమీపంలో యుద్ధనౌకలను మోహరించింది. ముఖ్యంగా సంక్షుభితంగా మారిన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే మర్చెంట్ షిప్లకు రక్షణ కల్పించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
22 వాణిజ్య నౌకలకు రక్షణ!
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మొత్తం 22 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో 6 ఎల్పీజీ నౌకలు, ఒక సీఎన్జీ నౌక, 4 క్రూడ్ ఆయిల్ నౌకలు ఉన్నాయి. మిగిలినవి ఇతర వాణిజ్య సరుకులను తరలించే నౌకలుగా అధికారులు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే సోమవారం నుంచి కొన్ని నౌకలకు ఇరాన్ మార్గం కల్పించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించేందుకు భారత నౌకాదళం అప్రమత్తంగా ఉంది. అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు యుద్ధనౌకలు అక్కడే కాపు కాస్తున్నాయి.
పర్షియన్ గల్ఫ్ అంటే ఏంటి?
ఇరాన్ మరియు అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న సముద్ర ప్రాంతాన్ని పర్షియన్ గల్ఫ్గా పిలుస్తారు. ఇది అరేబియా సముద్రంలోకి చొచ్చుకువచ్చిన సముద్ర శాఖలా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు నిల్వలు ఉన్న ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గంగా కూడా పర్షియన్ గల్ఫ్ ప్రాధాన్యం సంతరించుకుంది.
