జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు తక్కువ ఖర్చుతో టోల్ చెల్లింపులు చేసే అవకాశం కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్వల్పంగా పెంచింది. ప్రస్తుతం రూ.3,000గా ఉన్న ఈ పాస్ ధరను రూ.75 పెంచి రూ.3,075కు నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త ధర 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పెంపు 2026–27 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఖర్చులు టోల్ తగ్గించేందుకు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారుల టోల్ ఖర్చును తగ్గించేందుకు ఈ వార్షిక పాస్ను గత సంవత్సరం ఆగస్టు 15న ప్రవేశపెట్టారు. దేశంలోని సుమారు 1,150 జాతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్వేల్లో ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ చెల్లుబాటవుతుంది. ఈ పాస్ను తీసుకున్న వాహనదారులు ఒక సంవత్సరం కాలంలో లేదా గరిష్టంగా 200 సార్లు టోల్ప్లాజాలను దాటే అవకాశం ఉంటుంది.
నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే!
చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ ఉన్న నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ గణాంకాల ప్రకారం, ఈ పాస్కు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు 56 లక్షలకు పైగా వాహనదారులు ఫాస్టాగ్ వార్షిక పాస్ను తీసుకున్నట్లు సమాచారం. ఇది తరచుగా హైవేల్లో ప్రయాణించే వారికి ఖర్చు తగ్గించే ప్రయోజనకరమైన పథకంగా మారింది.
