దేశంలో గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ సదుపాయం వినియోగిస్తున్న వినియోగదారులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు తీసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే పైప్ లైన్ గ్యాస్ ఉపయోగిస్తున్నవారు మళ్లీ ఎల్పీజీ సిలిండర్లను వాడటం సమంజసం కాదని పేర్కొంటూ కేంద్రం గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వినియోగదారులకు కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేయవద్దని కేంద్రం తెలిపింది. గ్యాస్ వనరులను సమర్థంగా వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పైప్డ్ గ్యాస్ వాడుతున్నవారి వద్ద ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్లు ఉంటే వాటిని సరెండర్ చేయాలని కూడా కేంద్రం సూచించింది. గ్యాస్ సరఫరాను సమతుల్యం చేయడం, అవసరమైన వారికి సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగిస్తున్న వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఇకపై సరఫరా చేయరాదని గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. ఒకవేళ ఇప్పటికే అలాంటి వినియోగదారుల వద్ద సిలిండర్ కనెక్షన్లు ఉన్నట్లయితే వాటిని వెనక్కి తీసుకోవాలని కేంద్రం తెలిపింది. వినియోగదారులు స్వయంగా తమ గ్యాస్ కనెక్షన్లను సరెండర్ చేయాలని, లేకపోతే అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పైప్ లైన్ గ్యాస్ అందుబాటులో ఉన్నప్పటికీ మళ్లీ సిలిండర్లను వినియోగించడం వల్ల ఇతర ప్రాంతాల్లో అవసరమైన వారికి సిలిండర్లు అందుబాటులో లేకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక నగరాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ సదుపాయం అందుబాటులో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప వంటి ప్రాంతాల్లో ఈ సదుపాయం విస్తృతంగా అందుతోంది. దీంతో అక్కడి నివాసితులు పెద్ద సంఖ్యలో పైప్ లైన్ గ్యాస్ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్లను కూడా వినియోగించడం వల్ల గ్యాస్ సరఫరాలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. అందుకే పైప్డ్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ కనెక్షన్లను కొనసాగించవద్దని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇదిలావుంటే దేశంలో గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులందరికీ సకాలంలో సిలిండర్లు అందిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్ సరఫరాలో ఎటువంటి పెద్ద సమస్యలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే కొందరు అవసరం లేకపోయినా ముందుగానే గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారని, అందువల్ల సరఫరా ప్రక్రియపై ఒత్తిడి పడుతోందని అధికారులు వెల్లడించారు. అందుకే ప్రాధాన్యత క్రమంలో వినియోగదారులకు సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంపై కూడా కేంద్రం రాష్ట్రాలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లను కూడా ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. అందుబాటులో ఉన్న సిలిండర్లను అవసరానికి అనుగుణంగా సరఫరా చేస్తున్నామని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఇళ్లు, ఆస్పత్రులు, హాస్టళ్ల వంటి ప్రాధాన్య రంగాలకు ముందుగా గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
ఈ విషయంపై భారత చమురు శాఖ సంయుక్త కార్యదర్శి మార్కెటింగ్ మరియు ఆయిల్ రిఫైనరీ విభాగానికి చెందిన సుజాత శర్మ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో సిలిండర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బ్లాక్ మార్కెటింగ్ను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి
