జగిత్యాల,క్రైమ్ మిర్రర్:- గొల్లపల్లి మండలం, తిరుమలాపూర్ (పి.డి) గ్రామ సమీపంలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. తిరుమలాపూర్ నుండి చిల్వకోడూరు వెళ్లే దారిపై, పెద్దమ్మ గుడి దాటిన తర్వాత రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు
శనివారం ఉదయం అటుగా వెళ్లే గ్రామస్థులు, పొలం పనులకు వెళ్లే రైతులు ఈ దృశ్యాలను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఘటనా స్థలంలో… వెదురు బుట్టలో రంగు రంగుల బట్టలు, పసుపు, కుంకుమలు,నిమ్మకాయలు, అన్నం ముద్దలు, గాజులు, కొబ్బరికాయలు,సగం కోసిన గుమ్మడికాయ, మంత్రించినట్లుగా కనిపిస్తున్న ఇతర వస్తువులు నిప్పులు రాజేసిన ఆనవాళ్లు (బూడిద) స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రజల భయాందోళనలు..
సాధారణంగా ఇలాంటి పూజలు అమాయక ప్రజలను భయపెట్టడానికో లేదా ఇతర దుష్ట శక్తులను ప్రసన్నం చేసుకోవడానికో చేస్తారని స్థానికులు నమ్ముతుంటారు. రహదారి పక్కనే, అదీ అమ్మవారి ఆలయ సమీపంలో ఇలాంటి క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో ఆ దారిలో ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎవరో కావాలనే గ్రామంలో భయాందోళనలు సృష్టించేందుకు ఇలాంటి పనులకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిఘా పెంచాలని డిమాండ్..
మండలంలోని పలు ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, స్థానిక అధికారులు గస్తీ పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అర్ధరాత్రి వేళ నిర్జన ప్రదేశాల్లో తిరుగుతున్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
