Indian Railways: రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన హెచ్చరిక వెలువడింది. భారత రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో సాంకేతిక అప్గ్రేడ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో కొన్ని గంటల పాటు పలు ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 14, 15 తేదీలలో రాత్రి సమయంలో ఈ అప్గ్రేడ్ పనులు నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే టికెట్ల బుకింగ్, టికెట్ రద్దు, వేచి జాబితా వివరాలు, పీఎన్ఆర్ స్థితి తెలుసుకునే సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు. ఈ కారణంగా ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
ఈ అంతరాయం దాదాపు 3 గంటలపాటు ఉండే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రయాణికులు తక్కువగా టికెట్లు బుక్ చేసుకునే అర్థరాత్రి సమయంలోనే ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఆ సమయంలో రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ పూర్తిగా పనిచేయదు. ఆన్లైన్ సేవలతో పాటు రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా అందించే ఆఫ్లైన్ సేవల్లో కూడా తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా పనిచేసే పీఆర్ఎస్ వ్యవస్థకు అనుసంధానమైన సేవలపై ఈ ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇక పండుగ సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రయాణికులకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. మార్చి 19న ఉగాది పండుగ రావడంతో చాలామంది తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో రైళ్లలో రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో రిజర్వేషన్ వ్యవస్థలో అంతరాయం కలగడం వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చని భావిస్తున్నారు. అందువల్ల సేవలు నిలిచిపోయే సమయానికి ముందు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అంతేకాక ఈ సమయంలో ఇప్పటికే బుక్ చేసిన టికెట్లను కూడా రద్దు చేయడం సాధ్యం కాదు. అలాగే పీఎన్ఆర్ స్థితి తెలుసుకోవడం, రిజర్వేషన్ వ్యవస్థ వివరాలు చూడటం వంటి సేవలు కూడా అందుబాటులో ఉండవు. అత్యవసర సమాచారం కోసం ప్రయాణికులు రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ప్రయాణికులు సహకరించాలని కూడా రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు రైల్వే శాఖ పలు సాంకేతిక మార్పులు చేపడుతోంది. ముఖ్యంగా అక్రమ టికెట్ బుకింగ్ను అడ్డుకోవడం కోసం ఆధార్ ధృవీకరణను మరింత కట్టుదిట్టం చేశారు. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కూడా ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులన్నీ అమలులోకి తీసుకురావడానికి రిజర్వేషన్ వ్యవస్థలో సాంకేతిక నవీకరణలు చేపడుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ALSO READ: Danger: చీకట్లో ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా?
