చావోరేవో పోరులో భారత జట్టు దూకుడు
సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్
విండీస్ ఆశలు గల్లంతు
చావోరేవో పోరులో భారత జట్టు పంజా విసిరింది. జింబాబ్వేపై విజయంతో సెమీస్ రేసులో నిలిచిన టీమిండియా.. ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్ను చిత్తు చేసింది. సంజూ శాంసన్(97 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడగా విండీస్ ఆశలు ఆడియాశలయ్యాయి. ఆఖర్లో పాండ్యా(17) ఔటౌనా.. శివం దూబే(8 నాటౌట్) అండగా సంజూ మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. గ్రూప్ A నుంచి టీమిండియా రెండో బెర్తు ఖరారు చేసుకోగా… రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ టోర్నీ నుంచి తప్పుకుంది.జ
సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో బ్యాటింగ్ కూర్పును మార్చుకున్న టీమిండియా.. వరుసగా రెండు విజయాలతో ముందంజ వేసింది. ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల ఛేదనలో ఓపెనర్ సంజూ శాంసన్(97 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగి ఆడాడు. పొట్టి కప్ చరిత్రలో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. 5 వికెట్లతో కరీబియన్ జట్టును ఓడించి ఇంటికి పంపింది.
అభిషేక్, పాండ్యా సత్తా చాటకపోయినా..
వెస్టిండీస్ నిర్దేశించిన భారీ ఛేదనలో భారత పవర్ ప్లేలోనే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది. ఫామ్లోకి వచ్చినట్టే అనిపించిన అభిషేక్ శర్మ(10) పేలవ షాట్తో పెవిలియన్ చేరాడు. అకీల్ హొసేన్ వేసిన తొలి ఓవర్లో ఏమాత్రం తొందరపడని అభిషేక్.. చివరకు అతడి ఉచ్చులో పడ్డాడు. పెద్ద షాట్కు యత్నించి.. హిట్మైర్ చేతికి దొరికాడు. ఆ తర్వాత వస్తూనే రెండు ఫోర్లతో అలరించిన ఇషాన్ కిషన్(10)ను హోల్డర్ బోల్తా కొట్టించాడు. సంజూకి జతగా కెప్టెన సూర్యకుమార్ యాదవ్(18) నిలబడగా.. పవర్ ప్లే చివరి ఓవర్లో శాంసన్ బౌండరీతో స్కోర్ 50 దాటింది. 6 ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోర్ 35 బంతుల్లోనే 48 రన్స్ జోడించిన ఈ జంటను షమర్ జోసెఫ్ విడదీశాడు. రూథర్ఫోర్డ్ డైవ్ చేస్తూ చక్కని క్యాచ్ అందుకున్నాడు.
షమర్కు చుక్కలు చూపిస్తూ సంజూ స్ట్రెయిట్ బౌండరీ బాదగా.. తిలక్ వర్మ(27) వరుసగా మూడు ఫోర్లు రాబట్టాడు. హోల్డర్ ఓవర్లో బౌండరీ బాదిన తిలక్.. అదే ఊపులో షాట్ ఆడి హెట్మైర్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. అప్పటికీ 32 బంతుల్లో 55 రన్స్ కావాలి. దూకుడ పెంచిన హార్దిక్ పాండ్యా(17)ను షమర్ వెనక్కి పంపిన తర్వాత వచ్చిన శివం దూబే(8 నాటౌట్) రెండు ఫోర్లతో.. భారత్ విజయానికి చేరువైంది. రొయారియో షెపర్డ్ వేసిన తొలి బంతిని సంజూ లెగ్ సైడ్లో సిక్సర్గా మలిచాడు. అంతే.. స్కోర్లు సమం అయ్యాయి. తర్వాతి బంతిని బౌండరీకి పంపిన శాంసన్ భారత్ను 5 వికెట్ల తేడాతో గెలిపించాడు.
భారత్కు భారీ టార్గెట్
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు భారీ టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్ రోస్టన్ ఛేజ్(40) శుభారంభమిచ్చినా.. జస్ప్రీత్ బమ్రా(2-36) విజృంభణతో ఒకే ఓవర్లో రెండు బిగ్ కోల్పోయిన విండీస్.. రొవ్మన్ పావెల్(34 నాటౌట్), జేసన్ హోల్డర్(37 నాటౌట్)ల విధ్వంసంతో కోలుకుంది. అర్ష్ దీప్ సింగ్ ఓవర్లో 24 రన్స్ చేయగా, ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బుమ్రా 14 పరుగులే ఇవ్వడంతో విండీస్ 195 పరుగులు చేసింది.
సెమీస్లో ఇలా..
భారత్, వెస్టిండీస్ మ్యాచ్తో ప్రపంచకప్లో సూపర్-8 దశకు శుభం కార్డు పడింది. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. మార్చి 4న సౌతాఫ్రికా.. కోల్కతా వేదికగా న్యూజిలాండ్తో తలపడనుండగా ఆ మరుసటి రోజున ఇంగ్లండ్.. ముంబైలో భారత్తో అమీతుమీ తేల్చుకోనుంది.సెమీస్లో గెలిచిన జట్లు ఈనెల 8న అహ్మదాబాద్లో టైటిల్ పోరులో తలపడతాయి.
