మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్ :- మిర్యాలగూడ మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) కుటుంబ సభ్యులు ముగ్గురు వేర్వేరు వార్డుల నుంచి అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు నుంచి, పెద్ద కుమారుడు బత్తుల సాయిప్రసన్నకుమార్ రెడ్డి 40వ వార్డు నుంచి, చిన్న కుమారుడు బత్తుల గణేష్ ఈశ్వర్ రెడ్డి 28వ వార్డు నుంచి మునిసిపల్ కౌన్సిలర్ పదవులకు పోటీకి దిగారు.ఈ ఎన్నికల్లో మునిసిపల్ చైర్మన్ పదవి మహిళా జనరల్ రిజర్వేషన్ కావడంతో, ఆ పదవిని లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవిని రాజకీయంగా ముందుకు తీసుకువచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చైర్మన్ పదవిపై పలువురు ఆశావహులు ఉన్నప్పటికీ, ఎన్నికల నిర్వహణలో పూర్తి నియంత్రణతో పాటు వ్యూహాత్మక ఆధిక్యం సాధించాలనే ఉద్దేశంతోనే బీఎల్ఆర్ కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలోకి దింపినట్లు స్థానికంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.మొత్తంగా మిర్యాలగూడ మునిసిపల్ రాజకీయాల్లో బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం కీలక పాత్ర పోషించనున్నదని, ఈ నామినేషన్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read also :-
క్యాతనపల్లిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. 22 వార్డులకు 241 నామినేషన్లు
Woman Suicide: భర్త కోతి అన్నాడని భార్య ఆత్మహత్య.. వామ్మో ఇదేం ఘోరం?
