క్రైమ్ మిర్రర్ : రాజమండ్రిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కాతేరు ప్రాంతంలోని గామన్ బ్రిడ్జి సమీపంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడు అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. యువతి గొంతు వద్ద బ్లేడ్తో గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె స్వయంగా గాయపర్చుకుని ప్రాణాలు తీసుకుందా? లేక ఘటనకు మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యువకుడు పురుగుల మందు సేవించడంతో పాటు చేతికి బ్లేడ్తో గాయం చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
రక్తపు గాయాలతో ఇద్దరూ అక్కడ పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువజంటకు సంబంధించిన వివరాలు, కుటుంబ పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
also read : బస్ డిపోలో విషాదం.. మెకానిక్ దుర్మరణం
