Yogi Adityanath Reaction: మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకపోవడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు కావాలనే ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు. మహిళల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని మహిళలు ఎప్పటికీ క్షమించరని కూడా అన్నారు.
మహాభారతంలోని ద్రౌపది ఘటనలా..
పార్లమెంటులో విపక్షాల ప్రవర్తనను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, అది మహాభారతంలోని ద్రౌపది ఘటనను గుర్తుకు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ సవరణ బిల్లు ఆమోదం పొందినట్లయితే, అది అన్ని పార్టీలకు గౌరవం తీసుకువచ్చేదని యోగి అన్నారు. అయితే కాంగ్రెస్తో పాటు ఇతర కూటమి పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల మహిళల్లో అసంతృప్తి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవడమే విపక్షాల లక్ష్యమని విమర్శించారు. ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్పై కూడా ఆయన స్పందించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశ నాయకులు గతంలోనే వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
ఏప్రిల్ 17ను ‘బ్లాక్ డే’
ఇక కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఏప్రిల్ 17ను ‘బ్లాక్ డే’గా అభివర్ణించారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా మహిళలు ఆశలు పెట్టుకున్నప్పటికీ, విపక్షాల వైఖరి వల్ల అవి నెరవేరలేదని ఆమె అన్నారు. లోక్సభలో జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా వచ్చిన ఓట్లు సరిపోకపోవడంతో అది ఆమోదం పొందలేదు. దీంతో మహిళా సాధికారతకు సంబంధించిన ఒక కీలక అవకాశం కోల్పోయినట్లు భావిస్తున్నారు.