మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కోపంతో దంపతులపై కత్తితో దాడి చేయగా భర్త మృతి చెందగా భార్య విషమంగా ఉంది. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన శంకరయ్య దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి దుకాణం దగ్గరకు వచ్చాడు. 100 రూపాయలు అప్పు ఇవ్వమని అడిగాడు. ఇందుకు శంకరయ్య ఒప్పుకోలేదు. దీంతో ఆ వ్యక్తి గొడవకు దిగాడు.
గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి శంకరయ్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డం వచ్చిన శంకరయ్య భార్యపై కూడా దాడి చేశాడు. దాడి అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ శంకరయ్య దంపతులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శంకరయ్య ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.