-
మంచినీటిని అందించి కిడ్నీ రోగాన్ని తగ్గించడమే ప్రాజెక్టు లక్ష్యం…
-
రోజుకు 22లక్షల నీరు సరఫరా
-
త్వరలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
విజయవాడ, క్రమ్మిర్రర్: ఎన్టీఆర్ జిల్లా ఎ కొండూరు మండలంలోని కిడ్నీ బాధిత గ్రామాలకు స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందించే లక్ష్యం తో చేపట్టిన ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తయింది. సుమారు 15 తండాల్లో 57వేల జనాభ నివసిస్తున్నారు. వీరికి ప్రతి రోజు 22లక్షల నీరు అవసరం అవుతుంది. గతేడాది సుమారు వందలాది మంది కిడ్నీ బాధితులు చనిపోయారు. ఈ గ్రామాలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేసి కిడ్నీ అరికట్టడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఎ కొండూరు మండలం అంటేనే కిడ్నీ వ్యాధులకు నిలయంగా మారిపోయిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ భూగ ర్భ జలాల్లో ఫ్లోరైడ్, ఇతర రసాయనాలు కలువగా వీటిని తాగిన వారికి కిడ్నీ వ్యాధి వ్యాపించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ కిడ్నీ మరణాలకు అడ్డుకట్ట వేయాలంటే రక్షిత మంచినీటి సరఫరా ఒక్కటే మార్గమని దశాబ్ద కాలంగా మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల వాసుల కలను నెరవేరుస్తూ కృష్ణా నది జలాలను తరలించే ప్రాజెక్టు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తి చేసి బాధితులకు అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెకు్ట వైసీపీ హయాంలో మందకొడిగా పనులు జరుగడతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటూ రికార్డు సమయంలోనే ప్రాజెక్టు పూర్తి చేసి పంపిణీకి సిద్దమైంది.
పదికిలోమీటర్ల పొడవుగా భారీ పైప్లైన్…
కుదప సంపు నుంచి పది కిలోమీటర్ల పొడవైన భారీ పైప్లైన్ ద్వారా కృష్ణా జలాలను ఎ.కొండూరు మండలానికి తరలిస్తున్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని నిల్వ చేసేందుకు తండాల్లో ఉన్న 44 పాత ట్యాంకులను పునరుద్ధరించడంతో పాటు కొత్తగా మరో 12 ట్యాంకులను నిర్మించారు. మొత్తం 56 ట్యాంకుల ద్వారా గిరిజన తండాల్లోని ఇంటింటికీ నీటిని పంపిణీ చేయనున్నారు. ప్రారంభంలో కొత్తగా నిర్మించిన నాలుగు ట్యాంకులకు నీరు ఎక్కకపోవడంతో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ అధికారులు శక్తివంతమైన మోటార్లను ఏర్పాటు చేసి ఆ సమస్యను అధిగమించారు. ప్రస్తుతం ట్రయల్ రన్లో భాగంగా గ్రామాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
అదనంగా మరో పైప్లైన్ పనులకు కొత్త ప్రతిపాదన…
అయితే ప్రస్తుత ప్రాజెక్టు సామర్థ్యంపై ప్రజల నుంచి కొన్ని విన్నపాలు అందుతున్నాయి. రోజుకు 57 వేల మందికి తలసరి 50 లీటర్ల చొప్పున 22 లక్షల లీటర్లను పంపింగ్ చేసేలా ఈ లైన్ను రూపొందించారు. కానీ ప్రజల అవసరాలు వంద లీటర్లకు పైగా ఉండటంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల కొందరు మళ్లీ పాత బోర్ల నీటినే వాడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం 22 లక్షల లీటర్ల పరిమితిని దాటి అదనపు నీటిని అందించేందుకు ఎ.కొండూరుకు మరో ప్రత్యేక పైప్లైన్ వేసేలా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టును శనివారమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. ఆయన టూర్ రద్దవటంతో మరో ముహూర్తానికి వాయిదా పడింది. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రజలకు పూర్తిస్థాయిలో అంకితం చేయనున్నారు.