క్రైమ్ మిర్రర్ : నటి త్రిష పేరును రాజకీయ విమర్శల్లో ప్రస్తావించడం తమిళనాడులో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగా.. తాజాగా ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఉదయకుమార్ ప్రసంగిస్తూ.. త్రిష పేరును ప్రస్తావించి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై విమర్శలు చేసినట్లు సమాచారం. విజయ్కు త్రిష ఇష్టమైన నటి అంటూ వ్యాఖ్యానిస్తూ, ఆమెను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే సందర్భంగా కావేరీ జలాల అంశాన్ని ఉదయకుమార్ ప్రస్తావించారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో త్రిష పేరును కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించారు.
అభిమానుల నిరసన
ఉదయకుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మదురైలో త్రిష అభిమానుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లు ఏర్పాటు చేసి ఆయన వ్యాఖ్యలను ఖండించారు. సినీ నటులను రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదని వారు పేర్కొన్నారు. త్రిష పేరును రాజకీయంగా ప్రస్తావించడం పట్ల సోషల్ మీడియాతో పాటు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత వివాదానికి దారితీస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
also read : చరిత్రలో నిలిచిపోయేలా గోదావరి పుష్కరాలు…!
