జమ్ముకాశ్మీర్, క్రైమ్ మిర్రర్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధిత కుటుంబాలకు పీఎం నరేంద్రమోడీ ప్రగాఢ సానుభూతి తెలిపి అన్ని వేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్లో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదుల చేతిలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎన్నటికీ తలొగ్గదని హెచ్చరించారు. ఇలాంటి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ట్వీట్…
‘గతేడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నా. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుంచి కోలుకుంటున్న మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఒక దేశంగా మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా నిలబడ్డాం. భారతదేశం ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.