చెన్నై, క్రైమ్ మిర్రర్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. డీఎంకే ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్తో సూపర్స్టార్ రజనీకాంత్ ఇవాళ చెన్నైలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో స్టాలిన్కు సంఘీభావం తెలిపేందుకే రజనీకాంత్ ఆయన్ను కలిశారని సమాచారం. ఈ కష్టకాలంలో తాను ఆయనకు అండగా ఉంటానని రజనీ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొంతసేపు జరిగిన ఈ భేటీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకే కూటమిలోని వీసీకే, వామపక్షాల నేతలు కూడా పార్టీ ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో స్టాలిన్ను కలిసి మద్దతు ప్రకటించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో 234 స్థానాలకు గాను స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కేవలం 59 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీకి చేరువలో ఆగిపోయింది.దీంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన మద్దతు ప్రకటించగా, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలతో కూడా టీవీకే సంప్రదింపులు జరుపుతోంది. ఈ రాజకీయ పరిణామాల మధ్య తమిళనాడు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ చెన్నైకి చేరుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం సంకీర్ణ రాజకీయాల శకంలోకి అడుగుపెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు