* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టేనా
* పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: రాజకీయాలకు బొత్స గుడ్ బై చెప్పనున్నారా? ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇటీవల పరిణామాలతో కలత చెందారా? లేకుంటే రాజకీయాల్లో కొనసాగ కూడదని భావించారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట ప్రెస్మీట్లో ఆయన బోరుగా విలపించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన పెద్దగా కనిపించలేదు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెబుతారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
పిసిసి అధ్యక్ష హోదాలో
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పిసిసి అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు బొత్స. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో రాజకీయాల్లో బాగానే రాణించారు. 1999లో పార్లమెంట్ సభ్యుడు అయిన బొత్స.. తరువాత చీపురుపల్లి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. ఆయన అకాల మరణంతో ముఖ్యమంత్రి రేసులో నిలబడ్డారు. కానీ రాజశేఖర్ రెడ్డి వారసత్వం కోసం జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబం పోరాటం చేసింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరింది. సహజంగానే ఇది బొత్స కు మింగుడు పడలేదు. ముఖ్యమంత్రి పదవిని సర్దుబాటు చేసే క్రమంలో బొత్సకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది హై కమాండ్. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తూ వచ్చారు బొత్స. కానీ అనుకోని రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బొత్స చేరాల్సి వచ్చింది. ఇప్పుడు దానిని హైలెట్ చేసేసరికి బొత్స తట్టుకోలేకపోయారు. మీడియా ముందు రోధించడానికి అదే కారణం.
ఇరుకున పెట్టిన టిడిపి..
అయితే తెలుగుదేశం పార్టీ బొత్స అప్పట్లో చేసిన ప్రకటనలతో పాటు వీడియోలను హైలెట్ చేస్తోంది. సహజంగానే దీని ప్రభావం బొత్సపై ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బొత్స విషయంలో అవకాశాలు ఇచ్చారు జగన్. కానీ తన ఇమేజ్కు డామేజ్ జరగడంతో బొత్స తట్టుకోలేకపోతున్నారు. పైగా విజయనగరం జిల్లాలో కూడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. అందుకే బొత్స సత్యనారాయణ రాజకీయ సన్యాసం తీసుకుంటారని.. రాజకీయాలనుంచి వైదొలుగుతారని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన పొలిటికల్ గా పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో క్రమేపి ప్రచారం పెద్దది అవుతోంది.
