HomeతెలంగాణKCR Jagtial Meeting: అందరి చూపు జగిత్యాల వైపు.. చాలా రోజుల తర్వాత జనంలోకి...

KCR Jagtial Meeting: అందరి చూపు జగిత్యాల వైపు.. చాలా రోజుల తర్వాత జనంలోకి కేసీఆర్!

* జీవన్ రెడ్డి చేరికకు రంగం సిద్ధం

* భారీ బహిరంగ సభ

* ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు కేసీఆర్ కోసం. ఆయన ప్రజల మధ్యకు ఎప్పుడు వస్తారా? ఏం చెబుతారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ నెల 20న జగిత్యాల రానున్నారు కేసీఆర్. అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతున్న క్రమంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ కేవలం చేరికల కు మాత్రమే పరిమితం కాదు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేదిగా ఉండబోతుందనేది విశ్లేషకుల మాట. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారు కేసీఆర్. తనను ఓడించారన్న బాధ, ఆపై కాంగ్రెస్ పార్టీకి అందలం ఎక్కించారన్న కోపము తెలియదు కానీ.. శాసనసభకు సైతం హాజరుకావడం లేదు. అదిగో ఇదిగో అంటూ కెసిఆర్ బయటకు రావడం పై వార్తలు వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీలో చేరిక నేపథ్యంలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ కచ్చితంగా పాల్గొంటారు. అందుకే ఇప్పుడు అందరి చూపు జగిత్యాలపై పడింది.

జీవన్ రెడ్డి తో పాటు భారీగా..

కాంగ్రెస్ పార్టీ తో నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్నారు జీవన్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్దండుడుగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి నేత గులాబీ పార్టీలో చేరుతుండడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బిఆర్ఎస్. జీవన్ రెడ్డి తో పాటు వందలాది మంది ముఖ్య నేతలు, వేలాదిమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గులాబీ పార్టీలో చేరనున్నాయి. ఇంతకాలం ఎవరినైతే వ్యతిరేకించారు జీవన్ రెడ్డి అదే కేసీఆర్ గూటికి చేరుతున్నారు. దీంతో జగిత్యాల సభలో కెసిఆర్ సంచలన ప్రకటనలు చేయనున్నారు అన్న టాక్ వినిపిస్తోంది.

జగిత్యాలకు ప్రత్యేక గుర్తింపు..

తెలంగాణలో జగిత్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఎటువంటి పోరాటం ప్రారంభించిన సక్సెస్. అందుకే కెసిఆర్ జగిత్యాలను తన తదుపరి కార్యాచరణకు వేదికగా ఎంచుకున్నారు. మహబూబ్నగర్ కు చెందిన ఇతర పార్టీల ప్రతినిధులు సైతం కేసీఆర్ నాయకత్వం కింద పని చేసేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో మొదలైన ఈ ఊపు దక్షిణ తెలంగాణకు కూడా వ్యాపించి.. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీకి అనుకూలత చేకూరుస్తుందని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి.

సభకు భారీ జన సమీకరణ..

మరోవైపు జగిత్యాల సభను కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. భారీగా జన సమీకరణ చేయనున్నారు. ఇందుకు గాను నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలను ఇన్చార్జిలుగా నియమించారు. జగిత్యాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోరుట్లకు వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ రవీందర్, వేములవాడకు బాల్క సుమన్, చొప్పదండికి పెద్ది సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక పర్యవేక్షణ బాధ్యతలను గ్యాదరి బాల మల్లు, మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు అప్పగించారు. లక్షలాది మందితో నిర్వహించే ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల దిశను మార్చాలన్న ఆలోచనతో గులాబీ పార్టీ శ్రేణులు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు