తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ కొత్త వాహనాలు అందించనున్నట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ.. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సమస్యలను తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేల వద్ద వాహనాలు లేకపోవడం వల్ల నియోజకవర్గాల్లో పర్యటించడం, ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టంగా మారుతోందని VCK ఎమ్మెల్యే జ్యోతిమణి అసెంబ్లీలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించిన సీఎం విజయ్.. ఎమ్మెల్యేల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వాహనాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కేవలం కార్లు ఇవ్వడమే కాకుండా.. వాటి నిర్వహణ, డ్రైవర్ తదితర ఖర్చుల కోసం ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నెలవారీ భత్యం కూడా అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. డ్రైవర్ జీతం, వాహన నిర్వహణ తదితర ఖర్చుల కోసం ప్రతి నెల రూ.75 వేల వరకు కేటాయించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే అసిస్టెంట్ కోసం నెలకు రూ.25 వేల భత్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యేల కార్యాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
మొత్తంగా ఎమ్మెల్యేల వాహన సదుపాయం, డ్రైవర్ ఖర్చులు, కార్యాలయ సిబ్బందికి భత్యాలపై సీఎం విజయ్ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read: ‘మల్లెపూల పల్లకి’ రీమిక్స్పై శివ నిర్వాణ క్లారిటీ.. నెగెటివ్ కామెంట్స్కు చెక్!
