Teen Plots Parents’ Murder for Love: మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఓ బాలిక తన తల్లిదండ్రులనే హత్య చేయడానికి ప్రయత్నించిన విషయం బయటపడింది. మొరేనా ప్రాంతానికి చెందిన గబ్బర్ ప్రజాపతి, మిథిలేశ్ ప్రజాపతిల కుమార్తె ఒక యువకుడిని ప్రేమిస్తోంది. అతడు ఘంటేనా ప్రాంతానికి చెందిన సుదేమా. ఈ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించరని భావించిన బాలిక, ప్రియుడితో కలిసి దారుణ నిర్ణయం తీసుకుంది.
చపాతీల్లో ఎలుకల మందు కలిపి..
తల్లిదండ్రులను అడ్డంకిగా భావించిన ఈ జంట, వారిని తొలగించాలని ప్లాన్ వేసుకున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూసి, రెండు రోజుల క్రితం ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఆ రోజు ఇంట్లో చపాతీలు తయారు చేస్తున్న బాలిక, వాటిలో ఎలుకల మందు కలిపింది. ఆహారం తిన్న వెంటనే తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత దిగజారడంతో గ్వాలియర్కు షిఫ్ట్ చేశారు.
మర్డర్ ప్లాన్ ను బయటపెట్టిన ఆడియో క్లిప్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసులకు ఒక కీలక ఆడియో క్లిప్ లభించింది. ఆ క్లిప్లో బాలిక తన ప్రియుడితో మాట్లాడుతున్న సంభాషణ ఉంది. అందులో ఎలుకల మందు తీసుకురావాలని, తానే చపాతీలు చేసి అందులో కలిపి తల్లిదండ్రులకు పెట్టాలని చెప్పిన విషయాలు స్పష్టంగా వినిపించాయి.
ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు బాలికను, ఆమెకు సహకరించిన ప్రియుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో తీసుకున్న ఈ నిర్ణయం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
