Surgical Drone in India: డ్రోన్లు ఈ రోజుల్లో ఫోటోలు, వీడియోలు తీయడం నుంచి వ్యవసాయ పనులు, ఫుడ్ డెలివరీ, విపత్తుల సమయంలో సహాయం వరకు ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు అదే డ్రోన్ టెక్నాలజీని యుద్ధరంగంలో గాయపడిన సైనికులకు చికిత్స అందించేందుకు వినియోగించాలని ఒక వినూత్న ఆలోచన వచ్చింది.
ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ సరికొత్త ఆవిష్కరణ
హరియాణాకు చెందిన ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ సంస్థ ‘ఎస్ఎస్-విమాన’ అనే ప్రత్యేక డ్రోన్ను అభివృద్ధి చేసింది. ఇది భారతదేశంలోనే రూపొందించిన తొలి సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడిన సైనికులను వెంటనే ఆస్పత్రికి తరలించడం కష్టమైన పరిస్థితుల్లో, ఈ డ్రోన్ అక్కడికే చేరుకుని చికిత్స అందించగలదు.
గోల్డెన్ అవర్లో చికిత్స అందకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడే గాయాల సమయంలో ఈ డ్రోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తస్రావాన్ని ఆపడం, గాయాల్లో ఇరుక్కున్న తూటాలు లేదా ఇతర పదార్థాలను తొలగించడం, కుట్లు వేయడం వంటి పనులు దీని ద్వారా చేయవచ్చు. ఈ డ్రోన్లో ఉన్న రోబోటిక్ చేతులను దూరంలో ఉన్న డాక్టర్లు నియంత్రిస్తూ చికిత్స చేస్తారు.
త్వరలోనే అందుబాటులోకి..
జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్ సుమారు 30 నిమిషాలు ఎగరగలదు. యుద్ధరంగానికి చేరుకున్న తర్వాత మరో 30 నిమిషాలపాటు చికిత్స అందించే సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉండగా, త్వరలోనే ప్రాణాలను కాపాడే మిషన్లలో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ డ్రోన్ మిలటరీ అవసరాలకు మాత్రమే కాకుండా, ప్రకృతి విపత్తుల సమయంలో సాధారణ ప్రజలకు కూడా సహాయం చేస్తుంది. అయితే, దీనిని హ్యాక్ చేసే ప్రమాదం ఉన్నందున, భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టుతున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
