క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- సోషల్ మీడియా దుర్వినియోగం, వ్యక్తిగత దూషణలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం, ఉద్దేశపూర్వకంగా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వాక్ స్వాతంత్ర్యం (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్) పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అది ఎవరికీ వ్యక్తిగత హననం చేసే హక్కును ఇవ్వదని ఆయన తేల్చి చెప్పారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని లేదా వ్యవస్థలను ప్రశ్నిస్తే స్వాగతిస్తామని, కానీ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం ఎవరి హక్కు కాదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. దేవుళ్లపైనా కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలకు దిగడం, డెత్ థ్రెట్స్ (చంపేస్తామని బెదిరించడం) వంటివి ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు.
కఠిన చర్యలు తప్పవు.. ఫేక్ అకౌంట్లపై ఫోకస్:- ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఫేక్ అకౌంట్లపై సమాచారం ఇవ్వాలని ప్రజలను కూడా ఆయన కోరారు.