క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులను సరదాగా భయపెట్టాలని చేసిన ఓ యువ వ్యాపారవేత్త ప్రయత్నం చివరకు అతని ప్రాణాలనే బలితీసుకుంది. ఫామ్హౌస్లో కనిపించిన ఓ చిన్న పామును చేతితో పట్టుకుని అందరినీ ఆటపట్టించేందుకు ప్రయత్నించిన యువకుడిని.. అదే పాము కాటేయడంతో మృతి చెందాడు. రాజేంద్రనగర్కు చెందిన నవాబ్ సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ (30) ఓ వ్యాపారవేత్త. స్నేహితులతో కలిసి మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్కు వెళ్లిన ఖుమైజ్ అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫామ్హౌస్ పరిసరాల్లో ఓ చిన్న కట్లపాము కనిపించడంతో దాన్ని చేతులతో పట్టుకున్నాడు. పామును చేతిలో పట్టుకుని స్నేహితులను భయపెట్టాలని ప్రయత్నించాడు. అయితే, ఈ క్రమంలో పాము అతని బొటనవేలిని కాటేసింది. మొదట్లో పాము చిన్నదే కావడంతో పెద్దగా ప్రమాదం ఉండదని భావించిన ఖుమైజ్, కాటు విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, చికిత్స అవసరం లేదని స్నేహితులకు చెప్పుకొచ్చాడు. కానీ గంట వ్యవధిలోనే విషం ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఖుమైజ్ మృతి చెందాడు. యువ వ్యాపారవేత్త ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు చివరకు విషాదంగా మారడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పాము కాటును నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ఘటన మరోసారి పాము కాటు విషయంలో అప్రమత్తత ఎంత అవసరమో గుర్తు చేసింది.