-
నిజాం సర్కార్లో అయితే చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్లు
-
వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం
-
కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
-
పేదలకు ఇల్లు ఇవ్వలేదు కాని కొడుకు, బిడ్డకు ఫాం హౌజ్లు
-
నిజాం సర్కార్లో అయితే చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్లు
-
భూపాలపల్లి జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్, క్రైమ్ మిర్రర్: పాపాలకు కేరాఫ్ అడ్రస్ అంటే కేసీఆర్ అని, ఆ దరిద్రుడు పేదలను విస్మరించి ఇండ్లు కూడ ఇవ్వలేదు. కొడుక్కు, బిడ్డకు, అల్లుడికి ఒక ఫాం హౌజ్ కట్టుకున్నరు.వాస్తు మంచిగ లేదని ప్రగతి భవన్, సచివాలయం కట్టాడు. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం కేసీఆర్! ప్రజా పాలనా.. పాపాల భైరవుడా!? రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కు ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ చేశారు.
కేసీఆర్ చేసిన పాపాలకు ఇదే ఆటవిక రాజ్యమైతే.. అడవిలో ఆయనను చెట్టుకు ఉరేసినా తప్పు లేకుండా పోయేదని మండిపడ్డారు. నిజాం సర్కార్లో అయితే కేసీఆర్ను చెట్టుకు కట్టేసి కొట్టేవారన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తురుపల్లిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఇతర మంత్రులతో కలిసి రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
రైతు భరోసా పథకంలో భాగంగా రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. మొదటి, రెండు విడుతల్లో కలిపి రూ.5,700 కోట్లు జమ చేశామని, ఇంకో రూ.3,300 కోట్లు జమ చేస్తామని చెప్పారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ చేయాలనే గొప్ప సంకల్పం తీసుకున్నామన్నారు. ఏడాది తిరిగేలోగా రైతు రుణమాఫీ చేశాం. దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం’’ అని వ్యాఖ్యానించారు.
70వేల ఉద్యోగాలు…
నిరుపేదలకు నీడ కోసం ఇల్లు ఇస్తున్న పేదల కళ్లలో ఆనందం చూస్తున్నందుకు ప్రజా పాలన పోవాల్నా!? ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు పోవాల్నా..? తెలంగాణ ఉద్యమంలో సమిధలైన శ్రీకాంతచారి, కిష్టయ్య ఆలోచనలతో ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు పోవాల్నా.. సన్న బియ్యం ఇస్తునందుకు పోవాల్నా అంటూ సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు.
డబుల్ బెడ్రూం ఇస్తామని డబ్బా ఇళ్లు ఇచ్చాడని కేసీఆర్పై ధ్వజమెత్తారు. ఆనాడు బతుకమ్మ పేరిట ఇచ్చిన చీరెలను పొలాలకు కట్టుకున్నారని, నేడు సీతక్క నేతృత్వంలో ఇచ్చిన చీరలతో ఆడపడుచులు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎంత మందినైనా తొక్కుకుంటూపోతామని వ్యాఖ్యానించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ను ప్రధాన మంత్రిని చేసుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జీవన్ రెడ్డి కాంగ్రెస్ గుండెలపై తన్నిండు…
ఏడాది పదవి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలపై గుండెల మీద తన్ని శత్రువు పంచనా చేరుతావా అంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హతా ఉందా ? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది ? 14 సార్లు బీఫాం ఇచ్చింది. 11 సార్లు ఎమ్మెల్యే, ఒక్కోసారి ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. 40 ఏళ్లు నీ కోసం, నీ కుటుంబం కోసం కార్యకర్తలు వెన్నుగా నిలిచారు.
లక్షలాది మంది కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చడం వల్ల మువ్వన్నెల జెండా ఎగిరింది. నీ నెత్తిమీద దరిద్రం ఉండి ఓడిపోతే.. ప్రజాపాలన పోవాల్నా? వెనక్కి వెళ్లి పుట్టు పూర్వోత్తరాలు తవ్వితే నీ నిజ స్వరూపం తెలుస్తుంది. ఇందుకు మంత్రి తుమ్మల సజీవ సాక్ష్యం. ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ భుజం తట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. ఎక్సైజ్ శాఖ మంత్రిని చేస్తే నాదెండ్ల భాస్కర్ రావుతో జత కట్టి ఎన్టీఆర్కు వెన్నుపోటు పోడిచావు’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్గౌడ్, సీతక్క, వివేక్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.