ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువతకు శుభవార్త అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అప్రెంటిస్ నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని ఆశిస్తున్న డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 4,500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలు, కార్యాలయాల్లో ఎంపికైన అభ్యర్థులకు 12 నెలలపాటు శిక్షణ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు 128 పోస్టులు, తెలంగాణకు 100 పోస్టులు కేటాయించడం విశేషం.
ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే 2022 జనవరి 1 లేదా ఆ తర్వాత డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులుగా పరిగణించబడతారు. అభ్యర్థుల వయస్సు 2026 మే 31 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కల్పించనున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోసడలింపు వర్తించనుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 22, 2026 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ముందుగా జాతీయ అప్రెంటిస్ శిక్షణ పథకం పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం సంబంధిత బ్యాంకింగ్ నైపుణ్యాల అభివృద్ధి వేదిక ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయి.
దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.944 చెల్లించాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మహిళా అభ్యర్థులకు రూ.708 రుసుము నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ.236 రుసుము వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియను పలు దశల్లో నిర్వహించనున్నారు. మొదట ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. అనంతరం స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ఆన్లైన్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉండగా, పరీక్షను 100 మార్కులకు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేకపోవడం అభ్యర్థులకు అదనపు ప్రయోజనంగా చెప్పవచ్చు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ పరీక్ష జులై 2026 తొలి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం కానుంది. భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ప్రతి నెలా స్టైపెండ్ కూడా చెల్లించనున్నారు. దరఖాస్తు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: సారూ.. ఇది కరక్టేనా..? (VIDEO)